Thursday, March 15, 2018

India - mass mouvement in the people's war in India - support people's war! - Spring thunder tour new campaign of ICSPWI

ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని.. వేరొక‌ చేత్తో ఎర్రజెండా ఎత్తుకొని...
ఒక ఎన్కౌంటర్లన్నీ పాలకుల హత్యలే.... అమరుల ఆశయాలను కొనసాగిస్తాం....ఒక వీరుడు మరణిస్తే ఉదయింతురు వేలకొలది... కామ్రేడ్ స్వామి అమర రహే.... పూజారి కాంకేర్ అమరులకు జోహార్లు.... నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి... అనే నినాదాలతో రాంపేట గ్రామ‍ం మారు మోగింది. అమరుడైన‌ తమ ఆప్తుడు... తమ నాయకుడు.. తమ అన్న కోసం ఆగ్రామం కన్నీటి వరదలైంది... స్వామిని చంపిన ఈ పాలకులను కూల్చి ఆ కామ్రేడ్ కలలుగన్న సమసమాజం స్థాపించి తీరుతామని ఆ ఊరు ప్రతినబూనింది.... ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని మరో చేత్తో ఎర్రజెండా ఎత్తుకొని ఊరు ఊరంతా రగల్ జెండా అయ్యింది.

పూజారి కాంకేర్ వద్ద బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైన సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకుడు దాడబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్ అంత్య క్రియలు స్వామి స్వగ్రామం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం రాంపేటలో జరిగాయి. శనివారం రాత్రి నుండే వేలాదిగా విప్లవాభిమానులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి కామ్రేడ్ స్వామికి నివాళులు అర్పించారు. ఆదివారంనాడు జరిగిన కామ్రేడ్ స్వామి అంత్య క్రియల్లో భార్య రేణుక, సోదరుడు సమ్మయ్య బంధువులు, గ్రామస్థులతోపాటు పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, నారాయణ రావు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నాయకులు చిక్కుడు ప్రభాకర్, దుర్గాప్రసాద్, తెలంగాణ‌ ప్రజాఫ్రంట్ నాయకులు నలమాస కృష్ణ, మెంచు రమేశ్, అమరుల బందు మితృల కమిటీ నేతలు పద్మ కుమారి, అంజమ్మ, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్‌చందర్‌, టీవీఎస్‌ అధ్యక్షుడు కోట శ్రీనివాస్‌, మాకుల మహేశ్‌, సోమయ్య, బంధుమిత్రుల రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు కొత్తకొండ శాంత, భారతక్క తదితరులు పాల్గొన్నారు. అమరులపై విప్లవ కళాకారుడు డప్పు రమేశ్ పాడిన పాటలకు వేలాదిమంది కోరస్ పాడారు. ప్రజాకళామండలి కళాకారుల విప్లవ గీతాలతో రాంపేట మారు మోగింది.

ఈ సందర్భంగా అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి మాట్లాడుతూ.. ఇదే మార్చిలో గతంలో సృజన, సారక్క, శ్రుతి, సాగర్‌లను బూటకపు ఎన్‌కౌంటర్‌లో ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని అన్నారు. పీడిత ప్రజల పక్షాన భార్యను, తల్లిదండ్రులను వదిలేసి పోరాడిన స్వామిని నేడు కేసీఆర్‌ ప్రభుత్వం హత్య చేసిందన్నారు.
ʹఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, ఆపరేషన్‌ సమాధాన్‌ʹ పేరిట తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులను హతమారుస్తుందని ప్రజాస్వామ్య వేదిక నాయకుడు చిక్కుడు ప్రభాకర్‌ అన్నారు. వైద్యం కోసం సేద తీరుతున్న సమయంలో ద్రోహి ఇచ్చిన సమాచారంతో మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ప్రభాకర్‌ ఆరోపించారు.
లక్షలాది మంది పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ శ్మశానంగా మారుస్తున్నాడని ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మండి పడ్డారు. బంగారు తెలంగాణ అంటే మావోయిస్టులను హతమార్చడమా? అని ఆయన ప్రశ్నించారు.
ఆకలి ఉన్నంత కాలం విప్లవోద్యమం కొనసాగుతుందని విప్లవ రచయితల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్‌ అన్నారు. ఎదురు కాల్పులంటూ కట్టు కథలు అల్లుతున్న పోలీసులపై హత్య‌ కేసులు నమోదు చేయాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేయించాలని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
విప్లవ కళాకారుల గేయాలతో, ఎర్రజెండాల రెపరెపలతో అంతిమయాత్ర కామ్రేడ్ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ ఇంటి నుంచి రాంపేట ప్రధాన రహదారికి, అక్కడి నుంచి శ్మశానవాటిక వరకు దాదాపు నాలుగు గంట్ల పాటు సాగింది. 

No comments:

Post a Comment